తక్కెడబాట్లు -లక్ష్మీనరసయ్య సార్ విశ్లేషణ

159వ భాగం

ఘటనల మీద వచ్చే కవిత్వంలో  రెండు రకాలు కనిపిస్తాయి.ఘటన వరకే పరిమితమై మాట్లాడటం ఒక రకం.ఘటన గురించి మాట్లాడుతూనే దాని వెనక ఉన్న సామాజిక చరిత్రను కూడా వెలికి తీయడం రెండో రకం.అంటే ఆ ఘటనని అంటిపెట్టుకుని ఉన్న జీవితాన్ని అక్కడివరకూ తీసుకొచ్చిన వ్యవస్థాగత శక్తుల్ని మన ముందుంచటమన్నమాట.ఈ రెండో రకపు ఘటనా కవిత్వం మరింత కోరదగినదని వేరే చెప్పక్కరలేదు.ఇటీవల తగుళ్లగోపాల్ రాసిన' తక్కెడ బాట్లు' ఈ కోవకు చెందుతుంది. ముందు కవితను చూడండి.

"అయ్యా...వొంటి చేతిదాన్ని
తక్కెడబాట్లే నా చేతులు

కండ్లకు నల్లరిబ్బను కట్టుకొని
న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను గాదు
వొట్టి కండ్లు లేని దాన్ని
పండ్లమ్ముకునే ముసలిదాన్ని

దినాం ఇక్కడే,ఈ నల్లఛత్రి కిందనే
కుళ్లిపోయిన పండ్లలాగ పడుంట
బతుకును కుప్పలుకుప్పలుగా పెట్టుకుంట

పెద్దకొడుకు పోయినప్పటిసంది
ఈ అంగడే నా పెద్దకొడుకు
ఈ తక్కెడబాట్లే ఇంతజీవగంజి

సారూ....నీకాల్మొక్కుత...
వొకచేతిలో పండ్లగంప పట్టుకొని
బస్సుకిటికీలెంబడి
రయ్యరయ్య ఉరుకలేనిదాన్ని
కారుఅద్దాల ముందు
'పదికి మూడు,పదికి మూడు' అని కూతేసి
వొంగి నిలబడలేనిదాన్ని
కన్నోడిపేరు,కొన్నోడి పేరు నిలవెట్టాలని
అడుక్కోలేక అమ్ముకుంటున్న

ఇన్ని పండ్లముందు కూసున్నమాటే గానీ
ఎన్నడూ వొక పచ్చగూడ
నోట్ల ఏసుకోవడం ఎరుగను
ఏ జంగమయ్య వొచ్చైనా దానమడిగితే
తిట్టుకోకుండా పెట్టినదాన్ని

సంచిలో చిల్లరపైసలు లేకుంటే
వొక పండు ఎక్కువేసినదాన్నేగాని
ఎవరిసొమ్ము వుంచుకోలేదు

ఆవులూ,మేకలూ
ఈ పండ్లచుట్టే ఈగల్లాగ తిరుగుతున్నా
కట్టెవట్టి కసిరించుకున్నదాన్నేగానీ
ఏనాడు చేయ్యెత్తి వొక దెబ్బగొట్టలే

గుడ్డబట్ట సక్కగలేని మాములుదాన్నే గానీ
'మాములు' అడుక్కునే దాన్నిగాదూ
మోరు మార్కెట్లొచ్చి
నడుముమీద తంతే
చావలేక గుడ్డికొంగోలే బతుకుతున్న

బ్యాంకులు దోసుకొని
దేశాలు తిరిగిన దొంగదాన్ని కాదయ్య
ఇగో..ముత్యమంత జాగకు
ఇరవైరూపాలిచ్చిన రశీదుకాయితం

అయ్యా...కోపమొస్తే
వీపుమీద ఓ దెబ్బగొట్టుండ్రి
నీకు సలాంజేస్త
తక్కెడబాట్లు గుంజుకొని
నా వొట్టికట్టెలాంటి చేతులిరువకుండయ్యా..."
( తగుళ్ల గోపాల్)

'కరోనా కర్ఫ్యూలో ఆరు దాటినంక పండ్లమ్ముతున్నందుకు తక్కెడబాట్లు గుంజుకపోతున్న దృశ్యాన్ని చూసిన తరువాత' రాసిన కవిత ఇదని కవి తన నోట్ ద్వారా తెలిపాడు. రోడ్డుపక్కన   పండ్లమ్ముకునే ముసలమ్మ  ,తన తక్కెడ ను లాక్కుపోతున్న పోలీసోళ్లతో  వెళ్లబోసుకున్న మొర ఇది.ఇందులో ఇది అన్యాయమని చెప్పటమే కాదు, తమలాంటి  చిన్నా చితకా వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు రోడ్డుపాలవ్వడంలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలు నిర్వర్తించిన పాత్రని  గురించి కూడా ముసలమ్మ మాట్లాడుతుంది.ఈ దోపిడీ లోకంలో, కష్టం చేయటమే కానీ ఎవరి సొమ్మూ దోచుకున్న దాన్ని కాదని వాపోతుంది ఆ పేద వృద్ధురాలు.ఇలా కవితంతా ముసలమ్మ నాటకీయ స్వాగతంలా బయట పడుతుంది.

కవి నేరుగా చెప్పకుండా ముసలమ్మ చేత విషయాన్ని చెప్పించడం వల్ల ఈ కవితకు అవసరమైన ఉద్విగ్నత అమరింది.ముసలమ్మ మాట్లాడినప్పటికీ ఆ మాటల్లో ముసలమ్మ బతుకు ఆ స్థితికి రావటానికి చెందిన వ్యాపార రాజకీయాలూ, సరళీకృత ఆర్ధిక విధాన పాత్రా  కవి స్ఫురింప జేస్తున్నాడు.

"దినాం ఇక్కడే,ఈ నల్లఛత్రి కిందనే
కుళ్లిపోయిన పండ్లలాగ పడుంట
బతుకును కుప్పలుకుప్పలుగా పెట్టుకుంట

పెద్దకొడుకు పోయినప్పటిసంది
ఈ అంగడే నా పెద్దకొడుకు
ఈ తక్కెడబాట్లే ఇంతజీవగంజి

సారూ....నీకాల్మొక్కుత...
వొకచేతిలో పండ్లగంప పట్టుకొని
బస్సుకిటికీలెంబడి
రయ్యరయ్య ఉరుకలేనిదాన్ని
కారుఅద్దాల ముందు
'పదికి మూడు,పదికి మూడు' అని కూతేసి
వొంగి నిలబడలేనిదాన్ని
కన్నోడిపేరు,కొన్నోడి పేరు నిలవెట్టాలని
అడుక్కోలేక అమ్ముకుంటున్న"

అని ముసలమ్మ  భౌతిక దుస్థితిని ముందు తెలియజేసినప్పటికీ ,కవి టార్గెట్ దీనికి మించిన రాజకీయ, ఆర్ధిక వ్యవస్థ యొక్క దుర్మార్గాన్ని వ్యక్తం చేయటం.

"గుడ్డ బట్ట సక్కగలేని మామూలుదాన్నే గానీ
మామూలు అడుక్కునేదాన్నిగాదూ
మోరు మార్కెట్లొచ్చి
నడుము మీద తంతే
చావలేక గుడి కొంగోలే బతుకుతున్న"

మోర్లు, రిలయన్సులూ లాంటి పేద్ద పెద్ద మార్కెట్లోచ్చి ఇలాంటి బక్క వ్యాపారస్తుల్ని అడుక్కునే వాళ్ళ స్థితికి తీసుకు వచ్చిన చరిత్ర ను కవి ఇక్కడ చాల ఎఫెక్టివ్ గా మన స్ఫురణకు తెచ్చాడు. కళ్ళు సరిగా కనిపించని ముసలమ్మను గుడ్డి కొంగతో పోల్చడం గొప్పగా అమరిందిక్కడ.అందుకే పోయెమ్ ప్రారంభంలోనే ' కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని/న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను గాదు' అనే విసురు విసిరాడు కవి.

ముసలమ్మ క్యారెక్టర్ లో రెండు లక్షణాల్ని పట్టుకొచ్చాడు కవి.ఆమె అభిమానం గలిగిన మహిళ.ఎవరి సొమ్మూ ఉంచుకోదు.అంత దరిద్రంలో ఉంటూ ,ఎవరన్నా చేయి చాస్తే తనకున్నదాన్నే తిట్టుకోకుండా పెట్టిన మనిషి.తన దగ్గర చిల్లర లేనప్పుడు కొన్నవాళ్ళకి ఒక పండు ఎక్కువేసిన తత్వం ఆమెది.చుట్టూ మూగిన అవుల్నీ,మేకల్నీ కట్టెతో అదిలించటమే గానీ  ఏనాడూ వాటిని కొట్టి ఎరగదు.ముసలమ్మ గురించిన ఈ మానవ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ఆమె ఉన్నతిని సూచించాడు.ఇంత అభిమానం కలిగిన మహిళగాబట్టే  ధాటిగా విమర్శించే తత్వమూ ఆమెలో కవి చూపించిన రెండో లక్షణం.

"బ్యాంకులు దోసుకుని
దేశాలు తిరిగిన దొంగదాన్ని కాదయ్య
ఇగో... ముత్యమంత జాగకు
ఇరవై రూపాయాలిచ్చిన రశీదు కాయితం"

విషయాన్ని ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి.ఎక్కడి తెలంగాణా రూరల్ టౌన్ పేద పండ్లమ్ముకునే ముసలమ్మా, ఎక్కడ  నీరవ్ మోడీలూ,మాల్యాలూ.ఘటన ద్వారా జీవిత చిత్రణ అంటే ఇదే.వర్తమాన శకలాల్ని చరిత్రతో ముడిబెట్టి చెప్పటమంటే ఇదే. వీలున్నప్పుడల్లా చరిత్రలోని పూవుల్నీ, గాయాల్నీ నెమరువేస్తుంది సాహిత్యం. అందుకే కవిత్వం జాతి జ్ఞాపకాల జీవనది అవుతుంది.

దేశాన్ని చిక్కినకాడికి చిక్కినట్లు దోచుకునే బడా దొంగల పట్ల ఉన్న ఔదార్యం, అసహాయ నిరుపేద వృద్ధురాలి పట్ల లేని వ్యవస్థ మనది.ఈ దుర్మార్గాన్ని చూసి కంపించిపోయాడు కవి.

"అయ్యా... కోపమొస్తే
వీపుమీద ఓ దెబ్బ గొట్టున్ద్రి
నీకు సలాం జేస్త
తక్కెడ బాట్లు గుంజుకొని
నా వొట్టికట్టెలాంటి చేతులిరవకండయ్యా"

అని కవిత ముగిసినప్పుడు పాఠకుల్లో గాఢమైన ఉద్వేగం కలుగుతుంది.వ్యవస్థను ఈ స్థితికి తెచ్చిన శక్తులపట్ల తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది.

మనం మాట్లాడుకునే  కవిత్వ గాఢత, సాంద్రత అనే విలువలు  వాక్యాల, పదాల ఆకారంలో కాదు ఉండేది.పోయెమ్ చదివినాక పాఠకుల్లో కలిగే అనుభూతి చిక్కదనం రూపంలో ఉంటాయవి. ఇలా చూసినప్పుడు సాదాసీదాగా,రంగులూ పొంగులూ లేని పొడిపొడి వాక్యాలతో నిండిన ఈ కవితలో గొప్ప గాఢత ఉన్నట్లు.ఈ లక్షణం తగ్గుళ్ల గోపాల్ కవిత్వానికంతటికీ వర్తిస్తుంది.గ్రామీణ బహుజన స్వభావ వాదాన్ని కవిత్వం చేస్తున్న ఈ కవి ఆ సామాజిక సన్నివేశాలతో పాటు బడుగు జనం ఉన్నతినీ, ఉదాత్తతనూ హృద్యంగా చిత్రించాడు.ఈ చిత్రణలో భాగంగానే ప్రస్తుత కవితలోని ముసలమ్మ పాత్ర అర్ధమౌతుంది.ఈ ముసలమ్మ మెతకగా పడుండే ముసలమ్మ కాదు , ఆత్మాభిమానం కలిగిన ముసలమ్మ, ఎద్దడి లో గళంవిప్పే ముసలమ్మ.ఈ రీత్యా  గొప్ప కవిత్వంలో చిత్రితమైన ముసలమ్మల పాత్రల్లో ఎన్నదగిన ముసలమ్మ.

Comments